మిస్ వరల్డ్ విజేతలకు గవర్నర్ సన్మానం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో సోమవారం మిస్ వరల్డ్ విజేతలకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. మిస్ వరల్డ్ విజేత, థాయ్ లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్శ్రీ, రన్నరప్స్ హాసెట్ డెరెజే, మయా క్లైడా, ఆరేలి జాచిమ్ పాల్గొన్నారు. వీరిని సీఎం రేవంత్రెడ్డితో కలిసి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన భార్య సుధాదేవ్ వర్మ సన్మానించారు. విజేతల గ్లోబల్ విజయాలు, మానవతా కృషిని కొనియాడారు.
గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లోబల్ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమగ్రాభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి, దార్శనిక పాలనకు తెలంగాణ దిక్సూచి అని వ్యాఖ్యానించారు.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు, పురాతన ఆలయాలు, సహజ ల్యాండ్స్కేప్లు, సాంస్కృతిక ల్యాండ్మార్క్ల సందర్శనల ద్వారా అంతర్జాతీయ ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, వైవిధ్యాన్ని చాటిచెప్పారని పేర్కొన్నారు. గ్లోబల్ ఈవెంట్ నిర్వహణతో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు.
మిస్ వరల్డ్ సుచాత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఎప్పటికీ మనసులో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, రాజ్ భవన్ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.





