హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నోళ్ల కోసమే ఈ వార్త
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ ప్రాంత విద్యార్థి విజయాలు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశంలోనే అనేక ఫలితాలలో అగ్రగామిగా నిలబడుతుండడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. నాణ్యమైన విద్యనభ్యసించడం కోసం, సగటు మనిషి తనకున్న ఆర్థిక వనరులను పూర్తిగా వినియోగించి, అవసరమైతే రుణాలు సైతం తీసుకొని తమ బిడ్డల భవిష్యత్తు కోసం విద్యపై ఖర్చు చేస్తున్నాడు. కానీ, దీనినే అదనుగా తీసుకొని, ప్రైవేట్ విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేసి, వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చాలాకాలంగా కొనసాగుతోంది. విద్యా వ్యాపారాన్ని చట్టబద్ధంగా నియంత్రణ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రైవేట్ సంస్థలకు కాసుల పంట కొనసాగుతోంది.
జాతీయ స్థాయి నాణ్యత విద్యాసంస్థలలో ప్రవేశం పొందడం కోసం, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి, రకరకాల మాయలు, మోసాలు చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలు విలువలు పాటిస్తున్నప్పటికీ, చాలా ఎక్కువ శాతం మాత్రం ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, విద్యా వ్యాపారం ద్వారా ధనార్జన కేంద్రంగా పనిచేస్తున్నాయి. తెలంగాణలో పోటీ పరీక్షలకు కోచింగ్ రంగం గత పది ఏళ్లలో అనూహ్యంగా పెరిగింది. చాలా కోచింగ్ సంస్థలు ప్రధాన వ్యూహం ర్యాంకర్ల పేర్లను వాడటం. ఒక్క విద్యార్థి ర్యాంకును పదుల సంస్థలు ప్రచారం చేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నిత్యం సామాన్యమైపోయాయి.
ఫేక్ ప్రచారాలు...
కోచింగ్ సంస్థలు ఐఐటీ జేఈఈ, నీట్, ఎంసెట్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల ఫలితాలు వచ్చిన వెంటనే వాస్తవికంగా తమకు సంబంధం లేని విద్యార్థుల పేర్లు, ఫోటోలు ర్యాంకులను తమ ప్రచారంలో వాడుతున్నారు. కొన్ని సంస్థలు ఒకే విద్యార్థిని పలుచోట్ల రిజిస్టర్ చేసి, ఒకే ర్యాంకును తమదిగా ప్రకటిస్తున్నాయి. ప్రత్యేకంగా కోర్సు తీసుకోకపోయినా, 'వీరు మా స్టడీ మెటీరియల్ వాడారు అంటూ'అసత్య ప్రకటనలు ఇస్తున్నారు.
కొంతమంది ర్యాంకర్లను డబ్బుతో బ్రాండ్ అంబాసిడర్గా చేసుకొని ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇలాంటివాటికి కొన్ని సందర్భాల్లో విద్యార్థులు నిస్సహాయంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా అనేక రూపాలలో విద్యార్థులను మభ్యపెడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు గందరగోళానికి గురై, లక్షలు ఖర్చుపెట్టి ఆ కోచింగ్ సంస్థల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్నారు. ఆ తర్వాత వాస్తవ బోధన స్థాయి, కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర నిరాశను వారికి మిగులుస్తున్నాయి. వీటికి తోడు అడపదడపా, పోటీ పరీక్షల పేపర్ లీక్ ల వ్యవహారం కూడా విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని, మానసిక పరిస్థితిని మరింత కుంగదీస్తోంది.





