సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : జన నాయగన్’ ఇది దళపతి విజయ్ చివరి సినిమా అని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ ప్రకటించడంతో తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఆడియో లాంఛ్ అనంతరం విజయ్ చెన్నై చేరుకున్నారు. ఈ క్రమంలో విజయ్కు సంబంధించిన ఓ అనూహ్య ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నై ఎయిర్పోర్ట్లో విజయ్కు స్వాగతం పలికేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సమయంలో ఫ్యాన్స్ చూపించిన అత్యుత్సహంతో విజయ్ ఇబ్బందిపడ్డారు. పోలీసులు వారిని అన్నివిధాలుగా కంట్రోల్ చేసినప్పటికీ కొందరు విజయ్ని చూడడం కోసం, సెల్ఫీల కోసం మరింత ముందుకు వచ్చారు. ఈ క్రమంలో విజయ్ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి విజయ్ను తమ సహాయంతో లేపారు. కిందపడిన వెంటనే ఆయన సజావుగా నడుస్తూ ముందుకు వెళ్లడం కనిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనలో విజయ్కు ఎలాంటి గాయాలు కాలేదని చెబుతున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు “ఇది చిన్న అపశృతి మాత్రమే” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ కిందపడినట్లు ఓ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై విజయ్ టీమ్ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
జన నాయగన్ మూవీ గురించి:
డైరెక్టర్ H. వినోద్ అభిమానులకు ఒక ఎమోషనల్ ఫేర్వెల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సామజిక కథ, కథనాలతో జన నాయగన్ రూపొందిస్తున్నారు. ‘ఫస్ట్ రోర్’ పేరుతో జన నాయగన్ గ్లింప్స్ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సింహాసనం మీద ఠీవిగా కూర్చుని చేతిలో కత్తి పట్టుకుని ఇంటెన్స్ లుక్లో ఇంప్రెస్ చేశాడు విజయ్.
ఇందులో విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు. నిజమైన నాయకుడు అధికారం కోసం కాదు, ప్రజల కోసం వస్తాడు అనే క్యాప్షన్తో మొదలైన ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచింది. అలాగే, ఇప్పటివరకు రిలీజైన రెండు సాంగ్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అనిరుధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, పవర్ ఫుల్ ట్యూన్స్ అంచనాలు పెంచాయి.
ఈ సినిమాలో విజయ్కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్దే నటిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, మమిత బైజు, మోనిషా బ్లెస్సీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.





