తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : 2026, మే 13 నుంచి మే 21 వరకు ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం (మే 12) బోర్డ్ విడుదల చేసింది. మొత్తం 889 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 5.30 వరకు మరో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డ్ ఇప్పటికే విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో ఫెయిలైన వారికి, తక్కువ మార్కులు వచ్చి ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకునే విద్యార్థుల కోసం బోర్డు ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది.
కాగా, ఈ ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,98,358 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. దీంట్లో జనరల్ విభాగంలో మొత్తం 3,69,294 మంది, ఒకేషనల్ విభాగంలో 28,703 మంది విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కానున్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 2,67,141 మంది ఉండగా, సెకండియర్ నుంచి 1,30,856 మంది విద్యార్థులు ఉన్నారు.





