అల్లు అర్జున్కి గద్దర్ అవార్డు తెలంగాణ ప్రభుత్వంపై బన్నీ రియాక్షన్ ఇదే
Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 చిన్న కథ కాదు), ఉత్తమ డైరెక్టర్గా కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్ అవార్డ్స్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ X వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
‘పుష్ప 2 మూవీకి గానూ మొదటి ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవంతో సత్కరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా దర్శకుడు సుకుమార్ గారు, నా నిర్మాతలు మరియు మొత్తం పుష్ప బృందానికి పూర్తి క్రెడిట్లు వారికే దక్కుతాయి. ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను, మీ నిరంతర మద్దతు నాకు స్ఫూర్తినిస్తూనే’ఉందని అల్లు అర్జున్ పోస్టు ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
ఇకపోతే పుష్ప 2 సినిమా తెలంగాణలో సంచలనం రేపింది తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ పోలీసు స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగాడు. ఒకరోజు జైలు జీవితం కూడా గడిపాడు. అదే టైంలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంపు వంటివి ఇకపై ఉండవని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అదే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుకు ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ను ఎంపిక చేయడంతో విశేషత సంతరించుకుంది.
పుష్ప 2: ది రూల్’ రికార్డ్స్...
పుష్ప 2: ది రూల్’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో, స్క్రీన్లలో విడుదలైన సినిమాగా చరిత్ర సృష్టించింది. థియేట్రికల్ రన్లో రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పుష్ప-2 బాక్సాఫీస్ రికార్డులను రప్ప రప్ప చేసి పడేసింది.
భారతీయ సినీ చరిత్రలోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి తెలుగు సినిమా స్థాయి ‘తగ్గేదేలే’ అని అల్లు అర్జున్, సుకుమార్ మరోసారి రుజువు చేశారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ తన స్థాయిని గ్లోబల్ రేంజ్ కు పాకేలా పెంచుకున్నాడు. దానికి తోడు హిందీ నెట్ కలెక్షన్ల విషయంలో రూ.800కోట్ల మార్క్ బీట్ చేసిన ఫస్ట్ మూవీ కూడా పుష్ప 2 కావడం విశేషం. ఈ రికార్డ్ ఏ బాలీవుడ్ మూవీకి కూడా సాధ్యపడలేదు.





