జూన్ 18 నుంచి టెట్ పరీక్షలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీటెట్) పరీక్షలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, టెట్ కన్వీనర్ జి.రమేష్ బుధవారం రిలీజ్ చేశారు. మొత్తం 9 రోజులపాటు 16 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
కాగా, టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జూన్ 15 నుంచి 30వ తేదీ మధ్యలో నిర్వహిస్తామని ప్రకటించగా, తాజాగా పూర్తిస్థాయి షెడ్యూల్ను అధికారులు రిలీజ్ చేశారు. ఈ నెల 18, 19, 24, 30వ తేదీల్లో పేపర్2 మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు, 20, 24, 27 తేదీల్లో పేపర్ 1కు పరీక్షలు నిర్వహించనున్నారు. 28, 29, 30 తేదీల్లో పేపర్2 సోషల్ స్టడీస్ పేపర్ ఎగ్జామ్స్ ఉంటాయి.