టీమిండియాకు బిగ్ షాక్ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పంత్ ఔట్
Sports News క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : టీమిండియా వైస్ కెప్టెన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కాలి బొటనవేలు విరిగిపోవడంతో అధికారికంగా అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. గాయంతో ఈ వికెట్ కీపర్ కు ఆరు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో పంత్ లేకుండానే టీమిండియా మిగిలిన రెండు టెస్టులు ఆడనుంది. నాలుగో టెస్టులో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు పంత్ గాయపడ్డాడు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతారు. రిషబ్ స్థానంలో ఐదో టెస్టుకు ఇషాన్ కిషాన్ ను సెలక్ట్ చేసే అవకాశం ఉంది.
అసలేం జరిగిందంటే..?
ఇంగ్లాండ్, ఇండియా మధ్య బుధవారం (జూలై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోర్ 141 పరుగుల వద్ద గిల్ ఔటైనప్పుడు పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు. తనదైన శైలిలో ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చూపంచాడు. 48 బంతుల్లోనే 2 ఫోర్లు, సిక్సర్ తో 37 పరుగులు చేసి దూకుడు మీదున్నాడు. ఈ సమయంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. మూడో సెషన్లో వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 68 ఓవర్ మూడో బంతికి రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించే క్రమంలో పంత్ పాదానికి తీవ్ర గాయమైంది. కుడి పాదం వాయడంతో పాటు కొంచెం రక్తం కూడా వచ్చింది.
ఫిజియో వచ్చి వైద్యం చేసినప్పటికీ పంత్ నడవలేకపోవడంతో అతడు మైదానాన్ని వీడాడు. పంత్ రిటైర్డ్ హార్ట్గా వెళ్లిపోవడంతో అతని స్థానంలో జడేజా బ్యాటింగ్కు వచ్చాడు. మూడో టెస్టులో చేతి వేలి గాయంతో ఇబ్బందిపడిన పంత్కు మాంచెస్టర్ టెస్టులో కాలికి గాయం కావడం విచారకరం. ఈ సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్న పంత్ వరుసగా గాయపడటంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్, పంత్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్తో బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్లో తొలి రోజు ఇండియా ఆధిపత్యం చూపించింది. సాయి సుదర్శన్ (61), యశస్వి జైస్వాల్ (58) హాఫ్ సెంచరీలకు తోడు కేఎల్ రాహుల్ (46), రిషబ్ పంత్ (37 రిటైర్డ్హర్ట్) అండగా నిలవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది. జడేజా (19 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.