తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి మొన్నటిదాకా భారీ వర్షాలు దంచికొడితే.. ఇప్పుడు ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. రికార్డ్ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణ పరిస్థితి ఎండాకాలాన్ని తలపిస్తోంది.పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా సాయంకాలం సమయంలో క్యూమిలోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడని అనుకూల పరిస్థితులు, భూ ఉపరితం వేడెక్కుతుండటం, పచ్చదనం తగ్గిపోతుండటం, స్థానిక వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా అధికమవుతున్న వేడిమి పెరుగుతోంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు, ఎల్లుండి ( సెప్టెంబర్ 9,10,11) రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్...
ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఎల్లో అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో రేపు ( సెప్టెంబర్ 10 ) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లోద్దని సూచించింది వాతావరణ శాఖ.





