తెలంగాణలో సీటు దక్కేది ఎవరికీ సై అంటున్న పార్టీలు
తెలంగాణ Telangana News : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా మూడోసారి విజయం సాధించాలని బిఆర్ఎస్, అధికార బీఆర్ఎస్ ను గద్దించాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నాయి.ఇక ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని ఈసీ బృందం నేడు హైదరాబాద్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మరియు ఇతర అధికారులతో సమావేశం అయ్యారు.ఈవీఎంల సన్నద్ధత, ఓటర్ల జాబితాలో చేర్పులు, ఈవీఎంల తనిఖీ, అధికారులకు శిక్షణ తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులతో చర్చించారు. ఓటర్ల జాబితా మార్పులు చేర్పుల పై సమీక్షించిన ఈసీ బృందం, ఎటువంటి లోపాలు లేకుండా ఓటర్ల జాబితా ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితానికి కూడా సిద్ధం చేయాలని సీఈఓ ను ఆదేశించారు.
ఆర్వోలు మే ఒకటి నుంచి ఈవీఎంలను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పటి నుంచే ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. జూన్ 1 నుండి ఈవీఎంల మొదటి దశ చెకింగ్ చేపట్టాలని, ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపాలని ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు సిద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. అధికారుల శిక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్ కు వచ్చిన ఈసీ బృందం సూచించింది. దీంతో తెలంగాణా ఎన్నికలకు సీఈసీ కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.