లోన్ కోసం బ్యాంకుకు వెళితే రూ. 68 లక్షల ట్యాక్స్ అంటూ రైతుకు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇన్కం ట్యాక్స్ ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు ఇది ప్రతి సంవత్సరం మాములే కానీ, రైతులకు ఇన్కం ట్యాక్స్ అన్నది చాలా అరుదు. అందులోనూ పూరి గుడిసెలో ఉండే రైతు అయితే అసలు ఇన్ కం ట్యాక్స్ అన్న పదం కూడా విని ఉండడు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ పేద రైతుకు రూ. 68 లక్షల ఆదాయపన్ను వచ్చింది. లోన్ కోసం బ్యాంకుకు వెళ్లిన సదరు రైతుకు ఆదాయపన్ను రూపంలో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ గ్రామానికి చెందిన టేకం లేతు అనే 70 ఏళ్ళ వృద్ధ రైతు లోన్ కోసం స్థానిక బ్యాంకుకు వెళ్లగా తనకు రూ. 68 లక్షల ఆదాయపన్ను వచ్చిందని అది కడితేనే లోన్ ఇస్తామని పెద్ద షాక్ ఇచ్చారు బ్యాంకు అధికారులు. దీంతో అవాక్కయ్యాడు వృద్ధ రైతు. తన జీవితకాలంలో ఎన్నడూ ఆదాయపన్ను అనే పదం కూడా వినలేదని పూరి గుడిసెలో ఉండే తనకు ఆదాయపన్ను ఏంటని వాపోయాడు రైతు.
ఇన్ కం ట్యాక్స్ గురించి కూడా ఎప్పుడు వినని తనకు రూ. 68 లక్షల ట్యాక్స్ ఎలా వచ్చిందో తెలియక అయోమయంలో పడ్డాడు వృద్ధ రైతు. లోన్ ఇస్తారని బ్యాంకుకు పొతే బ్యాంకు అధికారులు ట్యాక్స్ కట్టమని చెప్పడంతో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలీక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతు. ఈ సమస్యను పరిష్కరించి తనకు లోన్ మంజూరు చేయాలని బ్యాంకు అధికారులను వేడుకుంటున్నాడు రైతు. మరి, పేద రైతుకు అంత పెద్ద మొత్తంలో ఆదాయపన్ను ఎలా వచ్చింది పొరపాటు ఎక్కడ జరిగింది వంటి విషయాలు ఇన్ కం ట్యాక్స్ అధికారులే తేల్చాలి.





