తెలంగాణ రైతులకు శుభవార్త నేటి నుంచే "రైతు బంధు"
తెలంగాణ Telanagana News : తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. నేటి నుంచే రైతు బంధు నిధులు విడుదల కానున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అద్భుత పథకం రైతుబంధు డబ్బులు ఈనెల 26వ తేదీ నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. వానాకాలం సాగుకు పెట్టుబడి సాయంగా 70 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు నిధులు సోమవారం నుంచి వారి ఖాతాల్లో జమ కానున్నాయి.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,720.29 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నేరుగా రైతుల ఖాతాల్లోకి వ్యవసాయశాఖ నగదు జమ చేయనుంది. ఈ సీజన్లో కొత్తగా 5 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేసింది. దీంతో సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది. తాజాగా విడుదల చేసిన 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు అందిన రైతుబంధు మొత్తం సాయం రూ.72,910 కోట్లకు చేరనుంది. ఈ సీజన్లో 1.54 కోట్ల ఎకరాలకు పంట సాయం అందుతుంది. కొత్తగా రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు.. తమ బ్యాంకు ఖాతాల వివరాలతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.