రేషన్కార్డు ఉంటేనే ఉచిత కరెంటు? ఇంటింటికి వెళ్లి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రేషన్కార్డు, ఆధార్, సెల్ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలిదశలో ‘గృహజ్యోతి’ కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటినీ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు.ఇటీవల ‘ప్రజాపాలన’లో ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులిచ్చారు. వీటిలో 30 శాతం మంది రేషన్కార్డు, ఆధార్, సెల్ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేయలేదు. తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలిదశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి.
వీటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్లకు నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నారు. కానీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత కరెంటు కోసం దరఖాస్తులిచ్చారు. వీటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డుల వివరాలే లేవు. సుమారు 10 లక్షల మంది అసలు దరఖాస్తు చేయలేదు. వీటన్నిటినీ సరిచూడడానికే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే ప్రాథమిక లెక్కలు తేలతాయి. లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేపో, మాపో జీవో జారీచేయనుంది. అందులో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి ‘విద్యుత్ పంపిణీ సంస్థ’ (డిస్కం)లు సాఫ్ట్వేర్ను రూపొందించాయి. కరెంటు కనెక్షన్ల తనిఖీపై రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం రెండు డిస్కంల సీఎండీలు, అన్ని విద్యుత్ సర్కిళ్ల ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష జరిపారు.





